న్యూఢిల్లీ : సోషల్ మీడియా సైట్లలో పెండ్లి పేరుతో మహిళలను మభ్యపెడుతూ రూ 3 కోట్ల వరకూ పలువురు మహిళలను మోసగించిన నైజీరియన్ను నోయిడా సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం దాదాపు 300 మంది మహిళలను నిందితుడు మోసగించాడని వెల్లడైంది.
సంజయ్ పేరుతో ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి సాయం చేయాలని కోరాడని బాధితురాలు వెల్లడించింది. నిందితుడి ఉద్దేశం పసిగట్టలేని మహిళ అతడి ఖాతాకు రూ. 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. నగదు పొందగానే నిందితుడు అన్ని సోషల్ మీడియా వేదికలపై ఆమెను బ్లాక్ చేసి ఆపై ఉడాయించాడు.
మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే తరహాలో నిందితుడు పలువురు మహిళలను మోసగించాడని పోలీసులు చెప్పారు. కేసు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.