చండీఘఢ్ : గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఐదుగురు సభ్యులను పంజాబ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారిని పటియాలాకు చెందిన సందీప్ సంధుగా గుర్తించారు. సంధుపై ఇప్పటికే పటియాలా, పతేఘఢ్ సాహిబ్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పంజాబ్ నుంచి సాగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఫతేఘఢ్ సాహిబ్ పోలీసులు భగ్నం చేశారు. గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గురి అనుచరుడైన సందీప్ సంధు గురుప్రీత్ ఆదేశాలపై పనిచేస్తుంటాడని, వీరిద్దరూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ డీఐజీ వెల్లడించారు. గురుప్రీత్ సింగ్ ప్రస్తుతం పటియాలా జైలులో ఉన్నాడని చెప్పారు.
సందీప్ సంధు యూపీకి చెందిన ఆయుధాల సరఫరాదారు నుంచి అక్రమంగా ఆయుధాలను సేకరించాడని పోలీసులు తెలిపారు. కరుడుగట్టిన నేరస్తుడు సందీప్ సంధుపై పలు హత్య కేసులు, హత్యాయత్నం కేసులున్నాయని చెప్పారు. ఇక అరెస్టయిన ఇతర గ్యాంగ్స్టర్లను హర్ప్రీత్ సింగ్, సందీప్ సింగ్, చరణ్జిత్ సింగ్, గురుముఖ్ సింగ్గా గుర్తించారు.