న్యూఢిల్లీ : నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో 150 మందికి పైగా మహిళలను వేధించిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సచిన్ కుమార్ (30) తనతో శారీరక సంబంధం ఏర్పరచుకోవాలని ఒత్తిడి చేస్తూ మార్ఫింగ్ చేసిన మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నాడు. వర్చువల్ వాట్సప్ నెంబర్లు, నకిలీ ఇన్స్టాగ్రాం ఖాతాలతో సచిన్ వేధింపుల పర్వానికి తెగబడ్డాడు. స్కూల్ను మధ్యలో వదిలేసిన సచిన్ కుమార్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఫ్రెండ్షిప్ యాప్స్ ద్వారా మహిళల నెంబర్లను సేకరించే నిందితుడు వర్చువల్ నెంబర్ల ద్వారా వాట్సాప్లో వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతాడు. ఓ మహిళ అతడి రిక్వెస్ట్ను నిరాకరించడంతో ఆమె మార్ఫ్డ్ ఇమేజ్లను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తానని ఆమెను బెదిరించాడు.
బాధిత మహిళ ద్వారక సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. తనకు తెలియని వర్చువల్ వాట్సప్ నెంబర్ నుంచి ఫ్రెండ్షిప్ మెసేజ్లు వస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ నెంబర్ను మహిళ బ్లాక్ చేయగా వివిధ వర్చువల్ వాట్సప్ నెంబర్ల నుంచి ఫ్రెండ్షిప్ మెసేజ్లు, వాట్సప్ కాల్స్ వచ్చాయి. నిందితుడిని మహిళ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆమె మార్ఫ్డ్ ఫోటోలు, అభ్యంతరకర ఫోటోలను పంపి వేధించాడు.
తనతో ఫ్రెండ్షిప్కు అంగీకరించకుంటే అభ్యంతరకర ఫోటోలను ఇన్స్టాగ్రాంలో వైరల్ చేస్తానని బెదిరించాడు. మహిళ అతడిని ఖాతరు చేయకపోవడంతో ఆమె మార్ఫ్డ్ ఫోటోలను నిందితుడు ఇన్స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు. తనతో ఫ్రెండ్షిప్ చేసేందుకు నిరాకరించే మహిళల వాట్సప్ డీపీ నుంచి సేకరించిన ఫోటోను గూగుల్ సెర్చిలో నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తానని నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు. ఎవరికీ పట్టుబడకుండా మహిళలను ఆన్లైన్లో ఎలా వేధించి బ్లాక్మెయిల్ చేయవచ్చనే టెక్నిక్లను తాను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని నిందితుడు తెలిపాడు.