బండ్లగూడ : మైనర్ బాలికపై అత్యాచారం చేసి పారిపోయేందుకు యత్నించిన బాలున్ని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ కనకయ్యలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించారు.
పదిహేడు సంవత్సరాల వయసున్న ఓ బాలుడు అదే ప్రాంతానికి చెందిన పదవ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక తల్లి అతనిని మందలించడంతో పాటు తమ నివాసాన్ని హైదర్గూడకు మార్చారన్నారు.
అయినా ఆ బాలుడు మారకుండా తరచు బాలికను వేధించడంతో పాటు ఈ నెల 29న ఆమెను బెదిరించి ఆలయానికి వెల్దామని హిమాయత్సాగర్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడ బలవంతంగా లైంగికదాడికి ఒడి గట్టాడు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక ఇంట్లో విషయం చెప్పడంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా బాలుడు గుల్బర్గాకు పారి పోతున్నట్లు అందిన సమాచారం మేరకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.