హైదరాబాద్ : సైబర్ దొంగల మోసాలను అరికట్టేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నైజీరియన్ ముఠాలకు సహకరిస్తున్న ఏజెంట్ పై బుధవారం పీడీ యాక్ట్ను విధించారు. బీహర్కు చెందిన అనిల్కుమార్ పాండే జీవనోపాధి కోసం ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ పరిచయమైన నైజీరియన్ ముఠాలతో స్నేహం చేశాడు. వారి సూచన మేరకు అనిల్కుమార్ పాండే బ్యాంక్ ఖాతాలను తెరిచి వాటికి సంబంధించిన డెబిట్ కార్డులను వారికి ఇచ్చి వారి వద్ద నుంచి 10 శాతం కమిషన్ను తీసుకుంటున్నాడు.
ఇలా ఢిల్లీలో ఓ కిరాణా దుకాణం పెట్టుకుని తెలిసిన వారితో బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారి డెబిట్ కార్డులను నైజీరియన్ ముఠాలకు ఇచ్చేవాడు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా జూలై నెలలో రాచకొండ సైబర్ కైం పోలీసులు అనిల్కుమార్ పాండేతో పాటు నైజీరియాకు చెందిన ఒబినేన్ ని అరెస్టు చేశారు. విచారణలో అనిల్కుమార్ పాండే తెరిచిన ఖాతాలలో అమాయకులకు చెందిన దాదాపు 24.50 లక్షల నగదును బదిలీ చేసుకుని ఆ తర్వాత వాటిని సైబర్ మోసగాళ్లు తీసుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఇలా నాలుగు కేసులలో అనిల్కుమార్ పాండే నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న అతని పై సీపీ మహేష్ భగవత్ పీడీ యాక్ట్ను విధించి ఏడాది పాటు జైలులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.