వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన మంచిర్యాల జిల్లా, దండేపల్లి చెందిన తాండ్ర ప్రదీప్, ముడిమడుగల చంద్రశేఖర్పై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ ఉతర్వులను జారీ చేశారు. సీపీ డా.తరుణ్ జోషి జారీచేసిన ఉత్తర్వులను ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ బి.రమేష్ వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్న నిందితులకు జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు.
పోలీసుల కథనం మేరకు..నిందితులిద్దరు మరో నలుగురు నిందితులతో కలిసి రాత్రి వేళల్లో కారులో ప్రయాణిస్తూ తాళం వేసివున్న ఇండ్లను టార్గెట్ చేసేవారు. తమ వెంట తెచ్చుకున్న సాధనాలతో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడే వారు.
ఇదే రీతిలో నిందితులు ఈ సంవత్సరం జనవరి 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో ధర్మసాగర్ మండల కేంద్రంలో వరుసగా ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
గతంలో జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల వేములవాడ, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదగిరి గుట్ట ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితులను ధర్మసాగర్ పోలీసులు ఈ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదిన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
నేరాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని సీపీ హైచ్చరించారు.