బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ఫై పీడీ యాక్ట్ నమోదు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి సమీపంలోని హకీంపేట కుంటలో నివాసం ఉంటున్న మహ్మద్ షాబాజ్ (21) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు.
ఏడాది క్రితం ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న షాబాజ్ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో ఇటీవల అతడిపై బంజారాహిల్స్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అయినప్పటికీ పద్దతి మార్చుకోని షాబాజ్ ఇటీవల దారినపోయే వారిని బెదిరిస్తూ డబ్బులు లాక్కుంటున్నాడు.
ఈ మేరకు అతడిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. దాంతో వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న షాబాజ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు షాబాజ్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపించారు.