Surat : గుజరాత్లోని సూరత్ పట్టణంలో దారుణం జరిగింది. దంపతులు, వారి కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. విషవాయువులు పీల్చడం కారణంగా వారు మరణించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా.. ఆత్మహత్యా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్, లాల్గేట్ ప్రాంతంలోని హరిపురా పరిధిలో నివాసం ఉండే ఫయాజ్ అహ్మద్ (40), అతడి భార్య ముబీనా (36), వారి కుమారుడు నోమ్నా (12) వారి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు.
హాల్లోనే ముగ్గురి మృతదేహాలు పడి ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారు మరణించిన ప్రదేశంలో విష వాయువులు లీకైనట్లు గుర్తించారు. ఈ విషవాయువు కారణంగానే వారు మరణించారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. విష వాయువు పీల్చిన ఆనవాళ్లు కూడా వారి శరీరంపై గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి అడుగుపెట్టేసరికి ఏదో విషవాయువు లీకైన వాసన వచ్చింది. ఏసీ కోసం ఇల్లు పూర్తిగా మూసి ఉండగా, ఏవో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
దీంతో ఏదైనా గ్యాస్ లీకై, బయటికి వెళ్లే మార్గం లేక, ఆ గ్యాస్ పీల్చి మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గ్యాస్ లీకేజీ ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుటుంబం ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి ఉమ్రా పూర్తి చేసుకుని వచ్చినట్లు డీసీపీ రాఘవ్ జైన్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వెల్లడించారు.