ముంబై : కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత తమకు జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడ్డామని ప్రజలు చెబుతుంటే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాక తనకు మాగ్నెటిక్ శక్తులు వచ్చాయని చెబుతున్నాడు. నాసిక్ శివాజీనగర్ కు చెందిన అరవింద్ సోనార్ అనే పెద్దాయన కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత తనలో మాగ్నెటిక్ శక్తులు పుట్టుకొచ్చాయని వెల్లడించాడు. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తర్వాత లోహపు వస్తువులు తన శరీరంపై అతుక్కుంటున్నాయని చెప్పాడు.
తన వాదనకు మద్దతుగా సోనార్ ఓ వీడియో కూడా రూపొందించాడు. ఈ వీడియోలో ఆయన శరీరంపై ప్లేట్లు, స్పూన్లు, కాయిన్లు అతుక్కుపోయిన తీరు కనిపించింది. చెమట వల్ల ఇదంతా జరుగుతుందని కుటుంబ సభ్యులు అనుకున్నా స్నానం చేసిన తర్వాత ఇలాగే జరుగుతోంది. అయితే ఆయనను పరీక్షించిన వైద్యులు వ్యాక్సినేషన్ తర్వాతే ఇలా జరిగిందని తాము నిర్ధారించలేదని, ప్రభుత్వానికి తాము నివేదిక పంపుతామని, ఆపై అవసరమైతే పరీక్షలు నిర్వహిస్తామని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యులు డాక్టర్ అశోక్ థొరాట్ పేర్కొన్నారు.