అమరావతి : పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మమకారం, తోబుట్టువుల సాంగత్యాన్ని వీడలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టింట, అత్తింట విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఉన్నారు.
పెద్ద కుమార్తె సుజన (26)కు గత నెల 17న చెన్నే కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన యువకుడితో ఘనంగా పెండ్లి జరిపించారు. అప్పటికే ఆమె ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రస్తుతం ఆమె గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు. వివాహం సందర్భంగా 10 రోజుల పాటు సెలవుపెట్టి పుట్టింట్లో ఉంటున్న సుజన వారం రోజులుగా అత్తవారింటికి ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈ సమయంలో సోమవారం విధులకు హాజరై ఇంటికి వచ్చిన ఆమె రాత్రి ఇంట్లోని స్నానాల గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
పుట్టింటి వారిని వదిలి అత్తింటికి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతోనే బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనంత గ్రామీణం సీఐ మురళీధర్రెడ్డి వెల్లడించారు.