ముంబై : కదులుతున్న రైలులో మహిళను ఎన్సీబీ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఔరంగాబాద్లో 35 ఏండ్ల నిందితుడిని పర్లీ రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితురాలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని హదప్సర్కు రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. మహిళా ప్రయాణీకురాలు నిద్రిస్తుండగా నిందితుడు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నిందితుడి నిర్వాకం పసిగట్టిన బాధితురాలు పెద్దగా అరవడంతో తోటి ప్రయాణీకులు అక్కడికి వచ్చి నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తిరిగి తన గమ్యస్ధానానికి చేరుకున్నారు. నిందితుడు గత ఎనిమిది నెలలుగా మానసిక వైకల్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. గత రెండు వారాలుగా సెలవులో ఉన్న నిందితుడు ఓ కేసు విచారణకు హాజరైనట్టు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుడిపై శాఖాపరమైన చర్యలకు యోచిస్తున్నామని ఎన్సీబీ అధికారుల తెలిపారు.