భోపాల్: నలుగురు వ్యక్తులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిన మహిళ, ఆమె ప్రియుడికి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాకు చెందిన 46 ఏండ్ల గుడ్డీ ఔజా అనే మహిళ భర్త 2011లో మరణించాడు. అనంతరం అల్లుడైన 29 ఏండ్ల గోపాల్ రజక్తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నది. దీనిపై పొరుగున ఉన్న వ్యక్తులు హేళన చేస్తుండటంతో వారిపై అత్యాచార ఆరోపణలు చేసింది. పొరుగున్న ఉన్న నలుగురు రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు 2014 ఆగస్ట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత దుస్తులు, వీర్యాన్ని పోలీసులు భద్రపరిచారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసు నాడు స్థానికంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు.
అయితే తాము ఏ తప్పు చేయలేదని, తమపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు నిందితులైన నలుగురు వ్యక్తులు కోర్టుకు తెలిపారు. అల్లుడితో ఆమె వివాహేతర సంబంధం నేపథ్యంలో తమను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. నిజ నిర్ధారణ కోసం వీర్యానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోరారు.
దీంతో వీర్యానికి డీఎన్ఏ టెస్ట్ చేయగా అది వారిది కాదని తేలింది. గోపాల్ రజక్ వీర్యంతో మ్యాచ్ అయ్యింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అసలు సంగతి బయటపెట్టాడు. తమ ఇద్దరి మధ్య సంబంధం ఉన్నదని, తమతో వైరం ఉన్న పొరుగింటి వ్యక్తులను ఇరికించేందుకు తప్పుడు కేసు పెట్టినట్లు ఒప్పుకున్నాడు.
నేరపూరిత కుట్రతో తప్పుడు ఫిర్యాదు చేయడంతోపాటు తప్పుడు ఆధారాలు సృష్టించిన వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు మహిళతోపాటు ఆమె అల్లుడికి పదేండ్ల జైలు శిక్ష విధించింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది.