వెంగళరావునగర్ : తల్లీ తన ఇద్దరు కొడుకులతో కలిసి కనిపించకుండా పోయిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం…బోరబండ ఎన్.ఆర్.ఆర్.పురం సైట్-3కు చెందిన ఆకుల శంకర్ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.
మంగళవారం తన పెద్ద కుమారుడు పాఠశాలకు రాలేదని పాఠశాల నుంచి సందేశం రావడంతో ఇంటికి వెళ్లి చూశాడు. ఇంట్లో భార్య శ్రావణి (27), కుమారులు శంకర్ (7), నిహిత్ (4) లు కూడా కనిపించకపోవడంతో పక్కింటి వారిని విచారించగా శ్రావణి వారాసిగూడలోని తన తల్లి వద్దకు వెళ్తున్నట్లు చెప్పిందని పక్కింటివారు తెలిపారు.
దీంతో శంకర్ వారాసిగూడలోని తన అత్తింటికి వెళ్లాడు. అక్కడికి తన భార్యా పిల్లలు రాలేదని తెలుసుకుని వారి ఆచూకీ కోసం ఆంతటా గాలించారు. ఫలితం లేకపోవడంతో బుధవారం ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.