జహీరాబాద్ : కూతురును బావిలోకి తోసిన తల్లి.. ఆ తర్వాత తనూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. న్యాల్కల్ మండలంలోని రాంతీర్థం గ్రామానికి చెందిన పుణ్యమ్మ (36) అనే మహిళ తొమ్మిదేళ్ల కూతురు సంగీత, ఐదేళ్ల కొడుకు రామ్తో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బావి వద్దకు చేరుకున్నారు. అయితే, కూతురు, కొడుకును బావిలో తోసేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో సంగీత బావిలో పడిపోగా.. కొడుకు తప్పించుకున్నాడు. ఆ తర్వాత పుణ్యమ్మ సైతం బావిలో దూకింది. తల్లీ కూతురు ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.