Madhya Pradesh : మధ్యప్రదేశ్లో దారుణ హత్య వెలుగుచూసింది. స్నేహితుడిని హత్య చేసిన ఒక వ్యక్తి, అతడి మృతదేహంపై ఉన్న బంగారంతో రుణం తీసుకున్నాడు. తాజాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, రాజ్గఢ్ జిల్లాలో పది రోజుల క్రితం ఈ హత్య జరిగింది. మృతుడిని గోలు వాల్మీకిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలవార్ ప్రాంతంలో వాల్మికి అనే వ్యక్తి పది రోజుల క్రితం కనిపించకుండా పోయాడు.
వాల్మికి మేకలు కాసేందుకు అడవికి వెళ్లేవాడు. ఘటన జరిగిన రోజు వాల్మికి స్నేహితుడు రఘువీర్ సౌందియా.. అతడి ఇంటికి వెళ్లాడు. వాల్మికి గురించి అడగగా, అతడు మేకలు కాసేందుకు అడవికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తర్వాత రఘువీర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ రోజు వాల్మికి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో అడవికి వెళ్లి చూడగా, అక్కడ మేకలు మాత్రమే ఉన్నాయి. వాల్మికి కనిపించలేదు. దీంతో రఘువీర్పై వాల్మికి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. అతడే ఏదో చేసి ఉంటాడని పోలీసులకు చెప్పినా సరిగ్గా స్పందించలేదు.
ఈ క్రమంలో పోలీసులు వాల్మికి కోసం వెతికారు. నిందితుడు రఘువీర్ కూడా ఈ వెతుకులాటలో పాల్గొనడం విశేషం. కుటుంబ సభ్యులు రఘువీర్పై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. తర్వాత సీనియర్ ఆఫీసర్లు స్పందించడంతో అప్పుడు రఘువీర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. తానే తన స్నేహితుడు వాల్మికిని హత్య చేసినట్లు వెల్లడించాడు. అతడిని హత్య అనంతరం పాతిపెట్టినట్లు చెప్పాడు. ఈ సమయంలో వాల్మికి చెవికి ఉన్న బంగారు కమ్మలు తొలగించాడు. ఆ బంగారాన్ని తాకట్టుపెట్టి, రూ.40,000 రుణం కూడా తీసుకున్నట్లు చెప్పాడు.
తర్వాత వాల్మికిని పాతిపెట్టిన చోటులో వెతికి చూడగా, అక్కడ అతడి అస్థిపంజరం లభ్యమైంది. హత్య జరిగిన పది రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.