ముంబై: బాలల దినోత్సవం వేళ ఒక బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా ఒక పోలీస్తోసహా 400 మంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాధిత మైనర్ బాలిక తల్లి రెండేండ్ల కిందట మరణించింది. దీంతో తండ్రి ఒక వ్యక్తితో ఆమెకు పెండ్లి చేశాడు.
ఏడాదికిపైగా అత్తవారింట ఉన్న ఆమె, మామ వేధింపులు భరించలేక పుట్టింటికి చేరింది. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. ఉద్యోగం ఇస్తామని నమ్మించిన ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. నాటి నుంచి 400 మంది వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. ఇందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో తాను గర్భం దాల్చినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణంపై దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు రెండు నెలల గర్భవతి అయిన ఆ బాలికకు అబార్షన్ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తన ప్రయత్నాలను ప్రారంభించింది.