Manjit Singh Bedi : అమెరికా (USA) లో భారీ మోసానికి పాల్పడి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ‘మోస్ట్ వాంటెడ్ (Most Wanted)’ జాబితాలో ఉన్న భారత సంతతి వ్యక్తిని పంజాబ్ పోలీసులు (Punjab Police) అరెస్ట్ చేశారు. సుమారు 600,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.5.7 కోట్లు) మోసం కేసులో నిందితుడైన 65 ఏళ్ల మంజీత్ సింగ్ బేడీ (Manjit Singh Bedi) ని జలంధర్ (Jalandhar) లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికా పౌరసత్వం పొందిన బేడీ వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమాలో కిరాణా దుకాణం నడిపేవాడు. అక్కడ ప్రభుత్వం పేదలకు అందించే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (SNAP) ప్రయోజనాలను దుర్వినియోగం చేశాడు. లబ్ధిదారుల ఈబీటీ కార్డులను స్వైప్ చేసి, వారికి ఆహార వస్తువులకు బదులుగా నగదు ఇచ్చి, అందులో సగం కమీషన్గా తీసుకునేవాడు. ఈ విధంగా 2024 మార్చి నుంచి 2025 జూన్ మధ్య ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించినట్లు అభియోగాలున్నాయి.
ఈ మోసంపై కేసు నమోదవడంతో కోర్టు ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని విచారణ పూర్తయ్యే వరకు వాషింగ్టన్ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అయితే బేడీ 2026 ఏప్రిల్లో కెనడా సరిహద్దు దాటి, అక్కడి నుంచి భారత్కు పారిపోయాడు. దాంతో ఎఫ్బీఐ ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి 150,000 డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. కాగా, భారత్కు వచ్చిన తర్వాత బేడీ జలంధర్లో అక్రమ ట్రావెల్ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలోనే పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలతో జలంధర్ కమిషనరేట్ పోలీసులు పరగ్పూర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. బేడీపై స్థానికంగా కూడా చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం బేడీ పంజాబ్ పోలీసుల కస్టడీలో ఉండగా.. త్వరలోనే అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం కానుంది.