లక్నో: బిల్డింగ్ 22వ అంతస్తు పైనుంచి దూకి యువ జంట మరణించింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ గ్రేటర్ నోయిడాలోని బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధి అయిన నోయిడా ఎక్స్టెన్షన్లోని అపార్ట్మెంట్ భవనాల సముదాయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఒక బిల్డింగ్ 22వ అంతస్తు పైనుంచి యువతీ, యువకుడు కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మృతులిద్దరూ ఒకరికి మరొకరు తెలుసని పోలీస్ అధికారి ఎలమారన్ చెప్పారు. ఘజియాబాద్కు చెందిన మహిళ శుక్రవారం ఉదయం ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడి ఇంటికి వచ్చినట్లు వివరించారు. అయితే వారిద్దరూ ఈ కఠిన నిర్ణయం తీసుకునేందుకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్ట్మార్టం కోసం ఇద్దరి మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారి మరణం గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు.
కాగా, నోయిడా సెక్టార్ 74లో మంగళవారం 34 ఏండ్ల ఐటీ ప్రొఫెషనల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించాడు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ముందు మే 3న ఇద్దరు మహిళలు కూడా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. నోయిడా సెక్టార్ 93ఏలోని పార్క్ వద్ద ఒక మహిళ తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే రోజున బరోలా గ్రామంలోని తన ఇంట్లో ఉరి వేసుకుని మరో మహిళ సూసైడ్ చేసుకుంది.