న్యూఢిల్లీ: సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తిని ప్రత్యర్థులు బహిరంగంగా కొట్టి చంపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల సునీల్ గున్ని అనే వ్యక్తి సోదరుడ్ని ప్రత్యర్థులు రాహుల్, అజయ్, ముఖేష్, వారి అనుచరులు కలిసి ఈ నెల 12న కొట్టి హత్య చేశారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు సునీల్ మరునాడు కొడవలితో వారి వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించాడు. అయితే వారు ఆ కొడవలి లాక్కొన్ని రాడ్లు, కర్రలతో అతడ్ని దారుణంగా కొట్టి చంపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సునీల్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, తిమర్పూర్ ప్రాంతంలో బహిరంగంగా జరిగిన ఈ హత్యా సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. సునీల్ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. సునీల్, అతడి సోదరుడ్ని హత్య చేసిన వ్యక్తులు హత్యతోపాటు పలు కేసుల్లో నిందితులని ఉత్తర ఢిల్లీ డీసీపీ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.