ముంబై : సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ముంబైలో ఓ వృద్ధుడు నెట్ఫ్లిక్స్ సబ్స్ర్కిప్షన్ను రెన్యువల్ చేసేందుకు ప్రయత్నిస్తూ రూ . లక్ష పోగొట్టుకున్నాడు. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రెన్యువల్ పేరుతో సైబర్ మోసగాళ్లు ముంబైకి చెందిన 74 ఏండ్ల వ్యక్తిని అడ్డంగా దోచేశారు. సబ్స్క్రిప్షన్ రెన్యువల్ చేస్తామని వారు బాధితుడి బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని ఆయన ఖాతా నుంచి రూ . లక్ష దోచుకున్నారు.
ఓటీటీ ప్లాట్ఫాం యూజర్లకు పంపే కమ్యూనికేషన్ తరహాలోనే తనకు ఈమెయిల్ రావడంతో సైబర్ నేరగాళ్లను బాధితుడు నెట్ఫ్లిక్స్ సిబ్బందిగా పొరపడ్డాడు. రూ 499 చెల్లించకపోవడంతో మీ సబ్స్క్రిప్షన్ హోల్డ్లో ఉందని నేరగాళ్లు వృద్ధుడిని నమ్మబలికారు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు జుహు పోలీస్ స్టేషన్లో నవంబర్ 29న ఫిర్యాదు చేశారు. తప్పుడు ఈమెయిల్తో రూ .499 చెల్లించేందుకు లింక్ను సైబర్ నేరగాళ్లు వృద్ధుడికి పంపారు. ఆయన ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండా లింక్ను క్లిక్ చేసి తన క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేశారు.
రూ. 1.22 లక్షల పేమెంట్ కోసం తన మొబైల్ పోన్లో ఓటీపీ జనరేట్ అయింది. ఎంత మొత్తానికి ఓటీపీని తాను షేర్ చేస్తున్నదీ గమనించకుండా బాధితుడు ఈమెయిల్లో ఓటీపీని షేర్ చేశారు. ఆపై బ్యాంక్ నుంచి మీరు రూ . 1.22 లక్షలు పేమెంట్ చేయకుంటే 8 ప్రెస్ చేయండని కాల్ రావడంతో మోసపోయానని గుర్తించాడు. రూ . 499 చెల్లింపునకు ఈమెయిల్లో లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ. లక్షకు ఓటీపీ పంపడాన్ని వృద్ధుడు పసిగట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చెల్లింపుల విషయంలో ఓటీపీని ఎవరితో షేర్ చేసుకోరాదని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.