Illegal affair : పెండ్లయిన మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న యువకుడి (24)ని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం వెలుగుచూసింది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మృతుడిని ఓల్డ్ సీమాపురికి చెందిన షహ్రుక్గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షుహ్రుక్ ముగ్గురు నిందితుల్లో ఒకరి సోదరైన వివాహితతో అక్రమ సంబంధం నెరపుతున్నాడు. వీరి వ్యవహారంతో ఆగ్రహానికి లోనైన మహిళ సోదరుడు మరో ఇద్దరితో కలిసి షహ్రుక్పై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. షహ్రుక్ను ఓ నిందితుడు మెటల్ చైర్తో కొడుతుండగా మరో నిందితుడు కత్తితో దాడి చేశాడు. షహ్రుక్ను కాపాడేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా మూడో నిందితుడు ఆమెను నిలువరిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
షహ్రుక్ను జీటీబీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. హత్య కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఆదిత్య, జుబెర్లుగా గుర్తించారు. జాఫర్ అనే మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా బాధితుడు షుహ్రుక్ క్రిమినల్ అని, అతడిపై పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.