బెంగళూరు: విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భార్యాభర్తలు, కలిసి జీవించాలని కౌన్సిలింగ్లో నిర్ణయించారు. అయితే ఆ వెంటనే భర్త వింతగా ప్రవర్తించాడు. కోర్టులోనే కత్తితో భార్య గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 32 ఏళ్ల శివకుమార్, 28 ఏళ్ల చిత్ర దంపతులకు ఏడేళ్ల కింద వివాహమైంది. వారికి ఒక పాప ఉంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం హోలె నరసిపుర ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
కాగా, శనివారం కౌన్సిలింగ్ కోసం శివకుమార్, చిత్ర ఆ ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారిద్దరికి గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాప భవిష్యత్తు కోసం విభేదాలను పక్కనపెట్టి కలిసి కాపురం చేయాలని ఫ్యామిలీ కోర్టు సూచించింది. తొలుత అంగీకరించని వారిద్దరూ చివరకు కలిసి జీవించేందుకు ఒప్పుకున్నారు. విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
కౌన్సిలింగ్ తర్వాత చిత్ర కోర్టు ప్రాంగణంలోని వాష్ రూమ్ వద్దకు వెళ్లింది. అనుసరించిన భర్త శివకుమార్ తన వెంట తెచ్చిన కత్తితో ఆమె గొంతు కోశాడు. పాపను కూడా హత్య చేసిందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడున్న వారు అడ్డుకుని అతడ్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో శివకుమార్ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయిన చిత్రను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో పోలీసులు శివకుమార్పై హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు కోర్టు ప్రాంగణంలోకి కత్తితో ఎలా ప్రవేశించాడు?, కలిసి జీవించాలని కౌన్సిలింగ్లో నిర్ణయించిన తర్వాత భార్యను ఎందుకు హత్య చేశాడు?, చిత్రను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడా? అన్న ప్రశ్నలకు సమాధానాలను దర్యాప్తులో రాబడతామని పోలీస్ అధికారి తెలిపారు.