చెన్నై : తన కుమారుడి(11) స్కూల్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు, వీడియోలను షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని అవధి సబర్బ్ ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడిని ప్రైవేట్ ఉద్యోగి బీ. మునుస్వామి(39)గా గుర్తించారు. మునుస్వామి కుమారుడు ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసం స్కూలు వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసింది.
టీచర్లు, విద్యార్ధులతో పాటు తల్లితండ్రులు సభ్యులుగా ఉన్న ఈ గ్రూపులో మునుస్వామి శనివారం అశ్లీల ఫోటోలు, వీడియో క్లిప్స్ను షేర్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారం ఇతర స్టూడెంట్ల తల్లితండ్రులకు ఆగ్రహం కలిగించగా వారు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసులు మునుస్వామిని ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే అభ్యంతరకర కంటెంట్ను తాను తన స్నేహితులకు షేర్ చేయాలనుకున్నానని తాగిన మైకంలో తాను పొరపాటున కుమారుడి స్కూల్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశానని నిందితుడు మునుస్వామి పోలీసులకు తెలిపాడు.