పాట్నా: ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతడి భార్యను బంధువులు గొంతుకోసి హత్య చేశారు. బీహార్లోని వైశాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది. జరాంగ్ రాంపూర్ గ్రామానికి చెందిన శశి ఠాకూర్ వారసత్వ భూమి కోసం తన బంధువులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తన బంధువులతో ఈ విషయంపై ఆయన గొడవకు దిగాడు. వారిపై దాడి చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు.
దీంతో బంధువులు శశి ఠాకూర్, ఐదు నెలల గర్భిణీ అయిన అతడి భార్య సంగీతా దేవిని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకు వచ్చారు. పదునైన కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను ఒక నిందితుడి ఇంటి ముందు పడేశారు. ఈ ఘర్షణలో మృతుడికి చెందిన ముగ్గురు బంధువులకు గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హత్యకు గురైన దంపతులకు రెండు, మూడు ఏండ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన గర్భిణీ సంగీతా దేవి తల్లి అహల్య దేవి 17 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు సన్నీ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.