డెహ్రాడూన్: వేట సరదా నలుగురి ఉసురు తీసింది. గన్ మిస్ ఫైర్ కావడంతో ఒకరు మరణించగా, భయాందోళనతో క్రిమిసంహార ముందు సేవించి ముగ్గురు స్నేహితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్లోని టెహ్రీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏడుగురు స్నేహితులు ఆదివారం కుండి గ్రామానికి సమీపంలో అడవి ప్రాంతంలో కాలినడకన వేట యాత్రకు వెళ్లారు. 22 ఏండ్ల రాజీవ్ గన్తో ఆ బృందాన్ని లీడ్ చేస్తున్నాడు. ఒక చోట అతడు జరిపడగా పొరపాటున గన్ ట్రిగర్ నొక్కుకుని పక్కన ఉన్న సంతోష్కు బుల్లెట్ గాయం కాగా అతడు మరణించాడు. దీంతో రాజీవ్ తన వద్ద ఉన్న తుపాకీతో పారిపోయాడు.
ఈ ఘటనతో మిగతా స్నేహితులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో సోబన్, పంకజ్, అర్జున్ క్రిమిసంహార మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా ఇద్దరు స్నేహితులైన రాహుల్, సుమిత్ గ్రామానికి తిరిగి వెళ్లి ఈ విషయాన్ని స్థానికులకు చెప్పారు. అనంతరం గ్రామస్తుల సహాయంతో సోబన్, పంకజ్, అర్జున్ను బెలేశ్వర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
అయితే పంకజ్, అర్జున్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ సోబన్ కూడా మరణించాడు. మృతులంతా 18 నుంచి 22 ఏండ్ల యువకులేనని జిల్లా అధికారులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు వెల్లడించారు.