ఉస్మానియా యూనివర్సిటీ : ప్రైవేట్ ట్రావెల్స్లో పనిచేస్తూ దాదాపు వారంరోజుల పాటు విధుల నిమిత్తం వెళ్లే వ్యక్తి పదిరోజులు దాటినా తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటలోని ఇందిరానగర్ ఏ కాలనీలో నివాసముండే చలమలశెట్టి సుబ్రమణ్యేశ్వర్ రావు (43)కు పందొమ్మిదేళ్ల క్రితం మాధవితో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పదిహేనేళ్లుగా సుబ్రమణ్యేశ్వర్రావు ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి విధి నిమిత్తం వెళ్లి తిరిగి వచ్చేందుకు వారం రోజులు పట్టేది. ఈ సమయంలో సెల్ఫోన్ సైతం స్విచ్ఛాఫ్లోనే ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 6న ఉదయం ఎనిమిది గంటలకు మాధవి విధులకు వెళ్లే సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు.
ఆ తరువాత ఉదయం పదిన్నర గంటల సమయంలో పిల్లలు కంప్యూటర్ క్లాసుకు వెళ్లే సమయంలో కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. మాధవి తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చేసరికి భర్త ఇంట్లో లేరు. ఇంట్లో చూడగా ఆయన బట్టలు సైతం కనిపించకపోవడంతో డ్యూటీకి వెళ్లాడని భావించింది.
మాధవి 7న సాయంత్రం భర్తకు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్లో ఉంది. దాంతో విధినిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లారని ఆమె భావించింది. పది రోజులు దాటినా తన భర్త తిరిగిరాకపోవడంతో బంధువులను ఆరాతీసింది. ఫలితం లేకపోవడంతో లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.