ముజఫర్నగర్: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడంలేదన్న కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లా బుధానా పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధానా పట్టణానికి చెందిన కుసుమ (30), వసీమ్ ఇద్దరూ భార్యాభర్తలు. తొమ్మిది సంవత్సరాల క్రితం వారి వివాహం జరిగింది.
పెండ్లయ్యి తొమ్మిదేండ్లు అవుతున్నా ఆ దంపతులకు ఇంతవరకు సంతానం కలుగలేదు. ఈ విషయమై వసీమ్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదే క్రమంలో పిల్లలు పుట్టడంలేదనే విషయమై ఆదివారం రాత్రి కూడా వసీమ్ భార్యపై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా ఆమెను చితకబాదాడు. దాంతో దెబ్బలకు తాళలేక ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించి, నిందితుడు వసీమ్ను అదుపులోకి తీసుకున్నారు.