ముంబై: ప్రపంచంలో అసహజ ప్రవృత్తి పెరిగిపోతోంది. చాలా మంది తమ కోరికలు తీర్చుకోవడం కోసం నీచాలకు దిగజారుతున్నారు. ఒకపక్క యువతులపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మరోపక్క వీధికుక్కల వంటి జంతువులపై కూడా కొందరు నీచులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో అయితే యువకులపై కూడా ఇలాంటి లైంగిక దాడులు జరగడం వినిపిస్తూనే ఉంది.
కొన్నిరోజుల క్రితం చెరకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బయటపడిన ఘటన కూడా కొంచెం అలాంటిదే. కాకపోతే ఇక్కడ యువకుడిని బలాత్కరించాలని అనుకుంది ప్రాణస్నేహితుడే. దీనికి ఒప్పుకోలేదని బెస్ట్ఫ్రెండ్ తల బద్దలు కొట్టి చంపేశాడా స్నేహితుడు.
ఈ ఘటన వాణిజ్య దేశరాజధాని ముంబైలో వెలుగు చూసింది. నవీముంబైలోని కరావే గ్రామంలో సమీపంలో కేంద్రియ విహార్ వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ మస్కే (27), రూపేష్ అలియాస్ రూప్సింగ్ (30) ఇద్దరూ మంచి స్నేహితులు. అక్టోబరు 22న రాత్రి పూట ఒక సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న బస్సులో వారిద్దరూ ఉన్నారు.
ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న విజయ్ తన వింత కోరిక బయటపెట్టాడు. తనతో శృంగారంలో పాల్గోవాలని రూపేష్పై ఒత్తిడి చేశాడు. దీనికి రూపేష్ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న విజయ్.. రోడ్డు పక్కనే ఫుట్పాత్ వేయడానికి తీసుకొచ్చిన సిమెంట్ టైల్స్ తీసుకొని రూపేష్ తలపగలగొట్టి చంపాడు.
ఆ తర్వాత అర్ధరాత్రికి పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. తన స్నేహితుడిని ఎవరో చంపేశారని ఫిర్యాదు చేశాడు. అయితే రూపేష్ గురించి మరింత సమాచారం కోసం విజయ్ను ప్రశ్నించే సమయంలో పోలీసులకు అనుమానం వచ్చింది. అతనేదో దాస్తున్నాడనే అనుమానంతో గట్టిగా విచారణ చేయగా విజయ్ అసలు విషయం చెప్పాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.