ముంబై : కుటుంబ సభ్యులతో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగుచూసింది. ఆగస్ట్ 7న హెచ్ఆర్ కన్సల్టెంట్గా పనిచేసే మహిళ తన భర్త, సోదరుడు, పిల్లలతో కలిసి దాదర్ వెళ్లి తిరుగుప్రయాణంలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కళ్యాణ్ వద్ద లోకల్ ట్రైన్లో ఎక్కారు.
జనరల్ ట్రైన్ కంపార్టెమెంట్ రద్దీగా ఉండటంతో మహిళ భర్త, కూతురు ఎలాగోలా సీటులో కూర్చోగా మహిళ, ఆమె సోదరుడు వారికి దగ్గరగా నిలబడ్డారు. రైలు కంజూర్మార్గ్ వద్దకు రాగా వెనుక నిల్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు గమనించిన మహిళ అతడిని చెంపదెబ్బ కొట్టారు. మహిళ భర్త, తోటి ప్రయాణీకులు కూడా నిందితుడికి దేహశుద్ధి చేశారు. నిందితుడిని బైకుల్లా ప్రాంతానికి చెందిన ఏఏ అన్సారీగా గుర్తించారు. థానే స్టేషన్లో నిందితుడిని దించి పోలీసులకు అప్పగించారు.