లక్నో : లైంగిక వేధింపుల కేసు దాఖలవడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన వ్యక్తి గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యూపీలోని బరేలిలో వెలుగుచూసింది. లైంగిక వేధింపుల కేసులో చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ 50,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు తీవ్రంగా కలత చెందాడు. తప్పుడు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మృతుడిని వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్గా పనిచేసే సుమిత్ కుమార్ సక్సేనా (27)గా గుర్తించారు. ఆయనకు భార్య ప్రియాంక ముగ్గురు పిల్లులున్నారు. ప్రియాంక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. సక్సేనా సోదరుడు అమిత్ తన సోదరుడిని లంచం డిమాండ్ చేసిన పోలీస్ కానిస్టేబుల్, మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. తన సోదరుడిని మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులు కోరగా అందుకు నిరాకరించడంతో దాడి చేసి కొట్టారని, మొబైల్ ఫోన్ గుంజుకున్నారని అమిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో సుమిత్ సక్సేనా పోలీస్ స్టేషన్కు వెళ్లగా తనపై లైంగిక వేధింపుల కేసు నమోదైందని, ఈ కేసులో చర్యలు చేపట్టకుండా ఉండాలంటే రూ 50,000 ఇవ్వాలని కానిస్టేబుల్ బెదిరించాడని చెప్పారు. డబ్బు కోసం తన సోదరుడు ఎంత ప్రయత్నించినా సమకూరకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.