ముంబై : లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇన్స్టంట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను బంధువులు, స్నేహితులు, కొలీగ్స్కు పంపడంతో 38 ఏండ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మలద్లో బుధవారం వెలుగుచూసింది.
ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాను తీసుకోని రుణాన్ని చెల్లించాలంటూ మృతుడిని రికవరీ ఏజెంట్లు వేధించారని అతడి సోదరుడు వెల్లడించాడు. నిందితుడు వివిధ మొబైల్ నెంబర్ల నుంచి 50 సార్లు కాల్ చేసి రుణాన్ని తిరిగి చెల్లించాలని వేధింపులకు గురిచేశాడని ఆరోపించాడు.
దీంతో తమ సోదరుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. ఏప్రిల్ 27న నిందితుడిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.