తిరువనంతపురం: కారు, జీప్ మధ్య రేస్ ఒకరి ఉసురు తీసింది. రేస్లో పాల్గొన్న జీప్, క్యాబ్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి కొట్టెక్కాడ్ ప్రాంతంలో మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ మధ్య ఈ రేస్ జరిగింది. ఆ రెండు వాహనాలు రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాయి.
కాగా, ఒక కుటుంబం గురువాయూర్ నుంచి క్యాబ్లో తమ ఊరికి తిరిగి వెళ్తున్నారు. అయితే మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ పక్కపక్కనే వేగంగా వస్తుండాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ తన వాహనాన్ని రోడ్డు పక్కకు మళ్లించి నిలిపాడు. అయినప్పటికీ మహింద్రా థార్ జీప్ వేగంగా వచ్చి ఆగి ఉన్న ఆ క్యాబ్ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్యాబ్ ముందు సీట్లో కూర్చొన్న వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రమాదం ధాటికి వెనుక సీట్లో కూర్చొన్న మృతుడి భార్య కారు నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. మృతుడి భార్య, కుమార్తె, మనుమరాలు, క్యాబ్ డ్రైవర్ గాయపడ్డారు.
మరోవైపు బీఎండబ్ల్యూ కారు ఆగకుండా వెళ్లిపోయింది. అయితే క్యాబ్ను ఢీకొట్టిన మహీంద్రా థార్ డ్రైవర్ను స్థానికులు పట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీఎండబ్ల్యూ కారును గుర్తించి ఆ డ్రైవర్ను కూడా అరెస్ట్ చేశారు. మహీంద్రా థార్ డ్రైవర్ మద్యం సేవించినట్లు రక్త పరీక్షలో పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబం ఫిర్యాదుతో రేస్లో పాల్గొన్న ఇద్దరు డ్రైవర్లపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.