ముంబై : పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో అవగాహనలోపాన్ని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫాంలపై అమాయకులను ఏమార్చుతూ అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి హానికారక లింక్ను క్లిక్ చేయడంతో ఏకంగా రూ . 35 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆన్లైన్లో పెద్దమొత్తంలో కమిషన్ ఆర్జించవచ్చని మభ్యపెట్టిన సైబర్ నేరగాడు బాధితుడి నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నాడు.
ముంబై మిరా రోడ్డుకు చెందిన బాధితుడి (40)కి నవంబర్ 22న గుర్తుతెలియని వ్యక్తి నుంచి టెలిగ్రాం మెసేజ్ వచ్చింది. ఆన్లైన్లో భారీగా డబ్బు సంపాదించవచ్చని బాధితుడికి మహిళ ఆఫర్ చేసింది. తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులకు ఆన్లైన్లో రేటింగ్ ఇవ్వడం ద్వారా పెద్దమొత్తంలో కమిషన్ సంపాదించవచ్చని మహిళ బాధితుడిని నమ్మబలికింది. బాధితుడు ఆసక్తి చూపగానే మరో మహిళ ఎంటరై వెబ్సైట్లో కొన్ని టాస్క్లు పూర్తిచేయాలని కోరింది. వెబ్సైట్కు లింక్ను షేర్ చేసిన మహిళ లాగిన్ కావాలని బాధితుడిని కోరింది.
టాస్క్ పూర్తిచేసిన వెంటనే వెబ్సైట్లోని అతడి ఈ-వ్యాలెట్కు నేరుగా డబ్బు చేరుతుందని పేర్కొంది. నవంబర్ 28న ఐటీ ప్రొఫెషనల్ అయిన బాధితుడు మహిళ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా టాస్క్లను పూర్తిచేశాడు. టాస్క్లను చేపట్టే క్రమంలో కొన్ని ప్రీమియం చార్జిలను చెల్లించాల్సి వచ్చింది. ఈ చార్జీలను అతడి ఆదాయంతో కలిపి తిరిగి ఇచ్చేస్తామని మహిళ నమ్మబలికింది. డిసెంబర్ 3న ఆయా టాస్క్లపై బాధితుడు రూ. 37.80 లక్షలు వెచ్చించగా వెబ్సైట్ ఈ-వ్యాలెట్లో అతడి ఆదాయం కేవలం రూ . 41.50గా చూపడంతో తాను మోసపోయానని టెకీ గుర్తించాడు. ఆపై వెబ్సైట్, టెలిగ్రాం గ్రూప్ డిలీట్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.