లక్నో : తన భార్యను వేధిస్తున్న ఆకతాయిలను వారించిన వ్యక్తిపై నిందితులు ఇనుప రాడ్తో దాడికి పాల్పడిన ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. లిసారి గేట్ ప్రాంతంలో వివాహితను అదే ప్రాంతానికి చెందిన యువకులు కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు నిందితులు వెంబడించి మొబైల్ ఫోన్ నెంబర్ అడుగుతుండటంతో వీరి ఆగడాలను భర్తకు తెలిపింది.
మహిళ గురువారం ఇంటి బయట ఉన్న సమయంలో మరోసారి ఆమెను నిందితులు వేధించారు. దీంతో వివాహిత భర్త నేరుగా నిందితుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. వివాహిత భర్తపై ఆగ్రహంతో నిందితులు అతడిపై ఇనుప రాడ్తో దాడికి దిగి గాయపరిచారు. స్ధానికులు బాధితుడిని కాపాడి దవాఖానకు తరలించారు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.