లక్నో: తన బుల్లెట్ బండికి చలానా వేయడంపై నిరసనతో ద్విచక్ర వాహనం యజమాని ఆత్మహత్యకు యత్నించాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. మీరట్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించారు. గంగానగర్-మవానా రోడ్డులోని లాల్ పార్క్ వద్ద నివాసం ఉంటే రోహిత్, తన తల్లికి మందుల కోసం బుల్లెట్ మోటార్ సైకిల్పై సెంటర్కు వచ్చాడు. సాకేత్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అతడి బుల్లెట్ బండి పెద్దగా శబ్దం చేస్తుందని ఆరోపిస్తూ శబ్ద కాలుష్యం కింద రూ.16,000 చలానా రాశారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ అధికారిపై అతడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు.
కాగా, బుధవారం రోహిత్ తన పేరెంట్స్తో కలిసి ట్రాఫిక్ ఎస్పీ జేకే శ్రీవాస్తవ కార్యాలయానికి వెళ్లాడు. తన బుల్లెట్ వాహనానికి రూ.16,000 జరిమానా విధించడంపై ఫిర్యాదు చేశాడు. ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్ అనిల్ కుమార్ మిశ్రా తనను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని ఆరోపించాడు. ట్రాఫిక్ ఎస్పీ కార్యాలయం అతడి ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో రోహిత్ తన పేరెంట్స్తో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ వెంట తెచ్చుకున్న కిరోసిన్ను తనపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన పోలీసులు వెంటనే రోహిత్ నుంచి కిరోసిన్ బాటిల్ తీసుకున్నారు. అతడితోపాటు తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కార్యాలయం ఎదుట గందరగోళం సృష్టించడంపై ఆ ముగ్గురికి జరిమానా విధించారు. అంతేగాక ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీరట్ నగర ఎస్పీ వినీత్ భట్నాగర్ తెలిపారు.