చెన్నై : భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తోందనే అనుమానంతో ఆమెపై యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో బుధవారం వెలుగుచూసింది. వేలూరు సమీపంలోని కొండత్తూర్ గ్రామంలో ఈ ఘటన జరగ్గా నిందితుడిని 59 ఏండ్ల వేలుగా గుర్తించారు. వేలుకు 12 ఏండ్ల కిందట వివాహం కాగా వారికి పది ఏండ్లు, ఏడేండ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. అభిప్రాయ భేదాలతో వీరిద్దరూ దాదాపు ఆరేండ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు.
వారం కిందట భార్యతో రాజీ కోసం వేలు రాగా ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బుధవారం వేలు తన భార్యపై యాసిడ్ పోసి పరారయ్యాడు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేయగా స్ధానికులు ఆమెను సమీప దవాఖానకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వేలును అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.