శేరిలింగంపల్లి : నానక్రాంగూడలో గంజాయి విక్రయిస్తున్న ఒ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మద్యప్రదేశ్కు చెందిన రాంనాథ్ యాదవ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్రాంగూడలో నివసిస్తున్నాడు. స్థానికంగా కూలీ పనిచేసుకొని జీవిస్తున్నాడు.
కాగా విశ్వసనీయ సమాచారం మేరకు నానక్రాంగూడ జయసింగ్ ఇంటి వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకొని సోదాలు చేశారు. ఈ సోదాల్లో 66 ప్యాకేట్లలో ఉంచిన 1.9 కిలోల గంజాయిని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.