ముంబై : 15 ఏండ్ల మైనర్ బాలికను పెండ్లి చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ముంబైకి చెందిన వ్యక్తి (27)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి, నిందితుడి తల్లితండ్రులతో పాటు వివాహం జరిపించిన మతపెద్దపై పోక్సో , బాల్య వివాహ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ముంబైలోని జేజే ఆస్పత్రిలో బాలిక శుక్రవారం శిశువుకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డెలివరీకి ముందు వైద్యులు బాలిక వయసు అడగడంతో భర్త, అత్తింటి వారు ఆమె వయసు 20 ఏండ్లుగా చెప్పారు. బాలిక ఆధార్ కార్డును వైద్యులు పరిశీలించగా ఆమె వయసు 15 ఏండ్లుగా వెల్లడైంది. దీనిపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పేదరికం కారణంగా బాలిక తల్లి కూతురును పోషించలేకపోవడంతో చదువు మాన్పించి నిందితుడితో పెండ్లి జరిపించిందని పోలీసులు తెలిపారు. బాలిక మైనర్ అని తెలిసినా భర్త అతడి తల్లితండ్రులు పెండ్లి విషయంలో ముందుకెళ్లారని వీరందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.