సికింద్రాబాద్ : తనను ప్రేమించాలంటూ యువతిని వెంబడిస్తు, వేధిస్తున్న ఓ యువకుడిని బోయిన్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకుంట్ల గ్రామానికి చెందిన నగేశ్ (25) గత గతంలో భువనగిరిలోని మణ్ణపురం సంస్థలో ఆడిటింగ్ విభాగంలో పనిచేశాడు.
ప్రస్తుతం బేగంపేట్లో నివాసముంటూ ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నగేశ్ గత కొన్ని రోజులుగా న్యూ బోయిన్పల్లికి చెందిన ఓ యువతి(20)ని వెంబడిస్తూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. యువతి పలుమార్లు నిందితుడిని హెచ్చరించినప్పటికీ తన తీరును మార్చుకోకపోవడంతో ఆమె విషయాన్ని తన తల్లికి తెలియజేసింది.
దీంతో ఆమె షీ టీంకు ఫిర్యాదు చేయడంతో షీ టీం పోలీసులు నిందితుడిని హెచ్చరించి పంపించి వేశారు. అయినప్పటికీ తన తీరును మార్చుకోని నిందితుడు ఈనెల 12 న యువతి తన ఇంటినుంచి కళాశాలకు వెళ్తుంటే దారిలో అడ్డుపడి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విసిగిపోయిన యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.