నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలోని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. నాసిక్ జిల్లా నిఫాద్ తాలూకాలోని లాసల్గావ్-వించూర్ రోడ్డుపై శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో లాసల్గావ్ నుంచి వించూర్కు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయిన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో ముగ్గురు 60-65 ఏండ్ల మధ్య వయసున్న వృద్ధులని, మరో వ్యక్తి వయసు 40 సంవత్సరాలు ఉంటుందని, వీరితోపాటు ప్రమాదంలో ఒక మహిళ కూడా మరణించిందని వెల్లడించారు.