పెద్దపల్లి : ఓ ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ పెద్దలు వారి ప్రేమను తిరస్కరించారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో వివాహ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కనుకుల గ్రామానికి చెందిన శివ, సుష్మిత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోవడంతో.. వారిద్దరూ తమ ప్రేమ గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను తిరస్కరించారు. కులాలు వేర్వేరు కావడంతో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఈ పంచాయితీ పోలీసు స్టేషన్ దాకా చేరింది. మైనర్లు కావడంతో పెళ్లి చేసుకునేందుకు అవకాశం లేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఆ ప్రేమికులిద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం శివ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి ఆత్మహత్యను తట్టుకోలేని సుష్మిత కూడా మంగళవారం ఉదయం బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమికుల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.