13 ఏళ్ల కన్న కూతురును టవల్ తో గొంతు నులిమి హత్య చేసిన కసాయి తండ్రి
2012 సంవత్సరంలో నల్లగొండ టూ టౌన్ పరిధిలో ఘటన
జీవిత ఖైదు, ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ. 5,000 జరిమాన విధిస్తూ తీర్పు
నల్లగొండ : 13 సంవత్సరాల కూతురును అత్యంత కిరాతకంగా హత్యచేసిన కసాయి తండ్రికి జీవిత ఖైదుతో పాటు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమాన విధిస్తూ నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.వి. రమేష్ బాబు మంగళవారం తీర్పు ఇచ్చారు.
నల్లగొండ టూ టౌన్ ఎస్.ఐ. డి. నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని బోయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రాంతానికి చెందిన నిందితుడు అంబూరి వెంకటేష్ 2012 సంవత్సరంలో లిటిల్ ఫ్లవర్ స్కూలులో 7వ తరగతికి చదువుతున్న 13 సంవత్సరాల తన కన్న కూతురు అంబూరి శివానిని టవల్ తో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. హత్య సంఘటనపై నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో 302, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని అప్పటి సిఐ మనోహర్ రెడ్డి విచారణ చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించారని చెప్పారు. నిందితుడు అంబూరి వెంకటేష్ భార్య ప్రభుత్వ టీచర్ గా పని చేస్తూ మృతి చెందడంతో తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, ఆ తర్వాత మరో పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాలని భావించాడు. అయితే తనకు ఉద్యోగం రావడానికి, మరో పెళ్లి చేసుకోవడానికి కుమార్తె శివాని అడ్డుగా ఉందని, చిన్నారిని అడ్డు తొలగించుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చని భావించి కుమార్తెను హత్య చేసినట్లు ఎస్.ఐ. తెలిపారు.
కేసు విచారణ పూర్తి కావడంతో పాటు పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడు వెంకటేష్ ఉద్దేశ్యపూర్వకంగానే తన కుమార్తెను హత్య చేసినట్లుగా దృవీకరించి ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు జీవిత ఖైదు, ఐదువేల రూపాయల జరిమాన, జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్ లాల్ వాదించగా సమర్ధవంతంగా పని చేసిన అప్పటి టూ టౌన్ ఎస్.ఐ., విచారణ అధికారి శ్రీనివాస్, సిఐ మనోహర్ రెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఐ. డి. నర్సింహులు, కోర్టు లైజన్ ఆఫీసర్ వి. శ్రీనివాస్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్ నరేందర్, టూ టౌన్ కోర్టు కానిస్టేబుల్ సురేష్ లను నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.