తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో తొలి ట్రాన్స్జెండర్ రేడియో జాకీ (ఆర్జే) అనన్య కుమారి అలెక్స్ చనిపోయిన రెండు రోజులకు ఆమె భాగస్వామి జిజు రాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనన్య మంగళవారం అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. 2020లో లింగమార్పడి శస్త్రచికిత్స తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, సర్జరీ లోపాలు ఆరోగ్య సమస్యలకు దారి తీశాయని, దీంతో పని చేయలేకపోతున్నానని సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది.
మరోవైపు అనన్యతో కలిసి ఉంటున్న 36 ఏండ్ల జిజు రాజ్, ఆమె మరణాంతరం కొచ్చిలోని తన స్నేహితుడి ఇంటికి మారాడు. శుక్రవారం స్నేహితుడు లేని సమయంలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన రాజ్ స్నేహితుడు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అనన్య ఆకస్మిక మరణం వల్ల మనస్థాపం చెందిన జిజు రాజ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.