వనస్థలిపురం, మార్చి 10: ఇద్దరిదీ రెండో పెండ్లే. 9 నెలల కిందటే మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభిద్దామనుకున్నారు. ఆరునెలలు ఆనందంగా గడిపారు. భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది భార్య.. కన్న పిల్లలపై లైంగిక వేధింపులను చూసి భరించలేకపోయింది. గొడవలు మొదలయ్యాయి. చివరకు నెల కిందట కత్తితో పొడిచి చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక ఇంకుడు గుంతలో పాతేసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన బుధవారం వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో బయటపడింది. ఏసీపీ పురుషోత్తంరెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మన్సూరాబాద్ డివిజన్ వివేకానంద కాలనీలో నివాసముండే గగన్ అగర్వాల్ (38) మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. పెండ్లయి విడాకులు తీసుకున్న పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగం అలియాస్ మరియాద (35)ను 2020 జూన్ 2న ఆర్యసమాజ్లో పెండ్లి చేసుకున్నాడు. అప్పటికే నౌసిన్కు నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. పెండ్లి తర్వాత నౌసిన్ తన పిల్లలను తల్లిగారింటివద్ద ఉంచింది. గగన్తో కలిసి వివేకానందనగర్లో ఉంటున్నది. ఆరునెలలు బాగానే ఉన్నారు.
గగన్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని నౌసిన్ కూతుళ్లు తల్లికి ఫిర్యాదు చేశారు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత నెల 6న మద్యం తాగి ఉన్న గగన్పై నౌసిన్ కత్తితో దాడి చేసింది. గగన్ స్నేహితుడు సునీల్ సాయంతో గొంతు కోసింది. పొట్టలో పొడిచి చంపేసింది. ఇంటి వెనుకవైపు ఉన్న ఇంకుడు గుంతను తవ్వి మృతదేహాన్ని పూడ్చింది. పైన కంకర పోసి చదును చేసింది. ఆపై పాతబస్తీలోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మృతదేహం వాసన రాకుండా 10 రోజులపాటు నిత్యం వచ్చి నీళ్లుపోసి వెళ్లిపోయేది. గత నెల 8న గగన్ గురించి అతని సోదరుడు నిలదీశాడు. దీంతో నౌసిన్తో కలిసి ఎల్బీనగర్ పోలీస్స్టేసన్లో ఫిర్యాదు చేశాడు. కేసును పోలీసులు వనస్థలిపురం స్టేషన్కు బదిలీచేశారు. దర్యాప్తులో భాగంగా నౌసిన్ను నాలుగుసార్లు ప్రశ్నించారు. తన భర్త అప్పుడప్పుడు అలా వెళ్లిపోతాడని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడో తెలియదని.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అనుమానించారు. తమదైన శైలిలో విచారించడంతో.. తానే హత్య చేసినట్టు అంగీకరించింది. హత్య సమయంలో గగన్ స్నేహితుడు సునీల్తోపాటు ఇంకా ఎవరెవరున్నారనే దానిపై కూపీలాగుతున్నారు. బుధవారం మృతదేహాన్ని వెలికితీసిన పోస్టుమార్టం నిర్వహించారు. మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.