తిరువనంతపురం: కేరళలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వడంతో పాటు నర మాంసాన్ని వండుకుని తిన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పతనంతిట్ట జిల్లా ఎలంతూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. జూన్ నెలలో రోసెలిన్ అనే మహిళ అదృశ్యమైంది. అలాగే సెప్టెంబర్లో పద్మ అనే వృద్ధురాలు కూడా కనిపించకుండాపోయింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, క్షుద్రపూజలు చేసే మహ్మమద్ షఫీ వద్ద పద్మ మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి విచారణ జరుపగా షాకింగ్ విషయాలు చెప్పాడు. రోసెలిన్, వృద్ధురాలు పద్మతో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని వారిని లోబరుచుకున్నాడు. డబ్బులు ఆశ చూపి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న భగవాల్ సింగ్, లైలా దంపతుల ఇంటికి ఆ మహిళలను విడివిడిగా పంపాడు.
ఆ ఇంట్లో మహిళల చేతులు కట్టి క్షద్ర పూజల కోసం ప్రైవేట్ భాగాల్లో కత్తితో పొడిచి హత్య చేశారు. నిందితురాలైన లైలా, మహిళ మాంసాన్ని వండగా ముగ్గురు నిందితులు నర మాంసం తిన్నారు. మరో మహిళ మాంసాన్ని ఉప్పులో ఉంచి నిల్వ చేశారు. వృద్ధురాలు పద్మ శరీరాన్ని 56 ముక్కలుగా నరికి ఒక బకెట్లో ఉంచి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పచ్చి నర మాంసాన్ని కూడా తిన్నట్లు అనుమానిస్తున్నారు. భగవాల్ సింగ్ ఇంటి ప్రాంగణంలో మూడు చోట్ల గోతిలో పాతి పెట్టిన ఇద్దరు మహిళల శరీర భాగాలను వెలికి తీసి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.