Anjali Death Case | కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీరట్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో.. కేసు విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న నిధి గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. 2020 ఏడాది డిసెంబర్ 6వ తేదీన డ్రగ్స్ తరలిస్తూ నిధిని ఆగ్రా రైల్వే స్టేషన్లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు సమీర్, రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్పై నిధి బయటకొచ్చింది. ఈ పరిణామంతో అంజలి డెత్ కేసులో నిధి పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ప్రమాద సమయంలో అంజలితోపాటు స్కూటీపై నిధి కూడా ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నిధి.. అంజలిపై పలు ఆరోపణలు చేసింది. మద్యం సేవించిన అంజలి స్కూటీ నడుపుతానని తనతో గొడవపడినట్లు చెప్పింది. మద్యం మత్తులో స్కూటీని స్పీడ్గా డ్రైవ్ చేసి కారును ఢీకొట్టినట్లు ఆరోపించింది. కారు కింద అంజలి చిక్కుకున్న విషయం తెలిసినప్పటికీ అందులోని వ్యక్తులు ఈడ్చుకెళ్లారని నిధి తెలిపింది. అయితే నిధి ఆరోపణలను అంజలి తల్లి ఖండించింది. నిధికి మద్యం అలవాటు లేదని.. నిధి అబద్ధం చెబుతోందని తెలిపింది. అంజలి మృతి కుట్రలో నిధి భాగమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నిధిని శుక్రవారం విచారణకు పిలిచిన పోలీసులు.. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.