కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్పురా ఏరియాలో మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. కానీ ఏ వ్యక్తి కూడా ఆమెపై కత్తితో దాడి చేయలేదని, తనకు తానే బ్లేడుతో గొంతు కోసుకున్నదని పోలీసుల విచారణలో తేలింది. తొలుత హత్యాయత్నంగా చిత్రీకరించాలని ఆమె భావించినప్పటికీ.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగు చూసింది.
9 నెలల క్రితం కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తితో బాధితురాలికి వివాహమైంది. కాగా ఆమె ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో రెండు నెలల క్రితం కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మరోసారి బ్లేడుతో గొంతు కోసుకుని హత్యాయత్నంగా చిత్రీకరించింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.