రాంచీ: మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిని అత్తమామల కుటుంబం హత్య చేసింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లడు హైబురు అనే 35 ఏండ్ల వ్యక్తి మార్చి 16 నుంచి అదృశ్యమయ్యాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దుమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చోట బావిలో ఒక మృతదేహం అవశేషాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అస్థిపంజరాన్ని వెలికితీసిన పోలీసులు మృతుడు లడు హైబురుగా గుర్తించారు. దీంతో అతడి హత్యపై దర్యాప్తు చేయగా అసలు సంగతి తెలిసింది.
లడు హైబురు ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన రెండో పెళ్లి అత్తింటి వారు అతడ్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో బావ, ఇతర బంధువులు హైబురును హత్య చేశారు. ఘట్సిల సబ్ డివిజన్ గురబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహతోలియా గ్రామంలోని అతడి నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో మృతదేహాన్ని పడేశారు.
కాగా, హైబురు మృతదేహం అవశేషాలు లభించడంతో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. దీంతో అతడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బావతోసహా నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు.