చండీగఢ్: నర్సులపై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఒక నర్సు మరణించగా, మరో నర్సు పరిస్థితి విషమంగా ఉంది. పంజాబ్లోని జలంధర్లో ఈ సంఘటన జరిగింది. పెరల్ ప్రైవేట్ హాస్పిటల్ పైభాగంలో నర్సుల హాస్టల్ ఉంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు ఆ హాస్టల్ వద్దకు వెళ్లారు. నర్సులు బల్జిందర్ కౌర్, జ్యోతిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఆరోగ్యం బాగోలేక నర్సు జ్యోతి విధులకు రాలేదు. దీంతో ఆమెను చూసేందుకు మరో నర్సు ఆ హాస్టల్ వద్దకు వెళ్లింది. అయితే జ్యోతి, కౌర్ రక్తం ముడుగుల్లో పడి ఉండటాన్ని చూసి ఆమె షాక్ అయ్యింది. ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తీవ్రంగా గాయపడి రక్తం మడుగుల్లో పడి ఉన్న వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే కౌర్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పడి ఉన్న విరిగిన పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ నర్సులపై ఎవరు, ఎందుకు ఆయుధాలతో దాడి చేశారో అన్నది తెలియలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జలంధర్ పోలీసులు తెలిపారు.