నల్లగొండ : మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులను అపహరిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దొంగల ముఠాను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ రేమా రాజేశ్వరి మీడియాతో మాట్లాడారు.
మిర్యాలగూడ రూరల్ పరిధిలోని ఆలగడప టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, బైక్పై వెళ్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. నిందితులను సూర్యాపేట జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పల్లెపాక లెనిన్, గుడుగుంట్ల శోభన్ బాబుగా గుర్తించారు.
జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ, సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి.. బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. గత రెండు సంవత్సరాల నుంచి సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 27 నేరాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి 40 తులాల బంగారం, రూ. 77 వేల నగదు, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని రిమాండ్కు తరలించారు.